‘రాజధానులు అంటే నగరాలు కట్టడం కాదు’
రాష్ట్రానికి మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు అవసరం రావచ్చని సీఎం జగన్ అన్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు. ఈ ప్రతిపాదనపై అన్ని ప్రాంతాల నుంచి హర్షం వ్యక్తం అవుతోందని... ఇది మంచి కాన్సెప్ట్ అంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. మూడు రాజధానులు అంటే మూడు నగరాలు నిర్మిచడం కాదని అంబటి అన్నారు. రాజధాని అంటే అధికార కేంద్రాన్ని ఏర్పాటు చేయడం మాత్రమే అని ఆయన వ్యాఖ్యానించారు.
రాజధానులు ఏర్పాటైతే ఆటోమేటిక్గా అభివృద్ధి సాగుతుందని అభిప్రాయపడ్డారు. వికేంద్రీకరణ ద్వారా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ది సాధ్యమవుతుందని... గతంలోనే ఇలాంటి ప్రయత్నం చేసివుంటే అభివృద్ధి సాధించి ఉండేవాళ్ళమని అంబటి అన్నారు. పాలకులు పరిపాలన చేసుకోవాలి తప్ప వ్యాపారం చేయకూడదని ఆయన గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షం, చంద్రబాబు సహజంగానే దీన్ని వ్యతిరేకిస్తారని... తాము ఏమీ చేసినా చంద్రబాబుకు ఇష్టం ఉండదని అన్నారు. పవన్ కళ్యాణ్ తెలిసి మాట్లాడతాడో తెలియక మాట్లాడతాడో తెలియని పరిస్థితి నెలకొందని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. అమరావతిలో చంద్రబాబు, అతని బినామీలు నాలుగువేల ఎకరాలు కొని సంపద సృష్టించుకున్నారని ఆరోపించారు.
సీఎం నిర్ణయం తరువాత కొంతమంది రైతుల పేరుతో చేస్తున్నది గమనించాలని అన్నారు. భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చూస్తుందని... .రైతుల ముసుగులో సీఎం పై వ్యాఖ్యలు చేస్తే సహించమని అంబటి రాంబాబు హెచ్చరించారు. ఆందోళన వ్యక్తం చేస్తే తప్పులేదు కానీ... ఇష్టం వచ్చినట్లు చేస్తే సహించమని వ్యాఖ్యనించారు.