తెలంగాణలో నిండు గర్భిణిపై అత్యాచారం... సెల్ఫోన్లో వీడియో తీసి
దిశ హత్యాచార ఘటనలో నలుగురు నిందితులకు ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఇంకా ఆ నలుగురు మృతదేహాలకు అంత్యక్రియలు జరగనలేదు. ఓ వైపు పోలీసులు, ప్రభుత్వాలు అత్యాచార నిందితులకు కఠిన శిక్షలు అమలు చేస్తున్నా... మరోవైపు కొందరు కామాంధులు మాత్రం రెచ్చిపోతున్నారు.
అమాయక అబలలపై అకృత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే మరో దారుణం చోటు చేసుకుంది. నిండు గర్భిణి అని చూడకుండా ఓ మానవ మృగం దాడి చేసింది. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామంలో భార్య భర్తలు నివాసం ఉంటున్నారు.
భర్త సెక్యూరిటీ గార్డుగా ఉండగా... భార్య ఇంట్లోనే ఉంటుంది. ఆమె నిండు గర్భిణి. ఈ నేపథ్యంలో ఈనెల 9న డిష్ రిపేరింగ్ అంటూ కనపర్తి రామకృష్ణ అనే వ్యక్తి ఇంటికి వచ్చాడు. ఇంట్లో మహిళ ఒక్కర్తే ఉండటంతో ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
ఈ క్రమంలో బాధితురాలి పుస్తెల తాడు కూడా తెంపేశాడు. అయితే డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చిన భర్తకు భార్య ఆందోళనకరంగా కనిపించింది. పుస్తెల తాడు కూర్చడం చూసి ఏమైందని అడిగాడు.దీంతో భార్య తనపై జరిగిన పాశవిక దాడి గురించి చెప్పింది.
దీంతో పరువు పోతుందని ముందుగా భావించిన కుటుంబం ఆ తర్వాత పోలీసుల్ని ఆశ్రయించింది. అయితే నిందితుడు అత్యాచారం చేసిన సమయంలో సెల్ ఫోన్లో వీడియో కూడా తీసినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.