జగన్ కొట్టిన దెబ్బకు నా మైండ్ బ్లాంక్ అయ్యింది.. రిటర్న్ గిఫ్ట్ ఇస్తా: ఎమ్మెల్వే శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ గీత దాటారనే ఆరోపణలపై సస్పెన్షన్కు గురైన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తొలిసారి మీడియా ముందుకొచ్చారు. హైదరాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. తాను అజ్ఞాతంలోకి వెళ్లిపోయానని వైఎస్ఆర్సీపీ గుండాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తాను ఏమైనా మాఫియా డాన్నా? అని మండిపడ్డారు. డాక్టర్ సుధాకర్, అచ్చెన్నలు ఎలా చనిపోయారో తెలుసని, వారి మాదిరిగా ఎమ్మెల్యే శ్రీదేవి చనిపోకూడదనే తాను ఇన్నాళ్లు బయటకు రాలేదని అన్నారు. దోచుకో, దాచుకో, పంచుకో అని జగన్ చెబుతున్నారని, తాను అలా చేయబోనని తెలిసి పార్టీ నుంచి తొలగించారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాపై దొంగ అనే ముద్ర వేశారని, డబ్బులు తీసుకుని పారిపోయానని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళను అని చూడకుండా ఇష్టారీతిగా విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. తాను చేసిన తప్పేంటో చెప్పకుండా వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయారు. ఈ సమయంలో రాజధాని అమరావతి రైతులకు మద్దతుగా ఉంటానని ఆమె హామీ ఇచ్చారు. అమరావతి పోరాటంలో ఇప్పటి నుంచి తాను భాగస్వామిని అవుతానని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలు తిరిగే పరిస్థితి లేదని, జగనన్న ఇళ్ల పథకం అనేది ఓ పెద్ద కుంభకోణమని ఆరోపించారు.
సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నుంచే తనకు ప్రాణహాని ఉందని, జాతీయ మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తానని అన్నారు. మానవహక్కుల సంఘం హామీతోనే ఆంధ్రప్రదేశ్లో అడుగుపెడతానని ఆమె స్పష్టం చేశారు. జగన్ కొట్టిన దెబ్బకు నా మైండ్ బ్లాంక్ అయ్యింది.. నాపై ఆరోపణలు చేసినవారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఎమ్మెల్యే శ్రీదేవి శపథం చేశారు.