తిరుమల వెళ్తున్నారా ? అయితే జాగ్రత్త.. మొదటి ఘాట్ రోడ్డులో పొంచి ఉన్న ముప్పు..!
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలకు నిత్యం వేలాది భక్తులు వస్తూ పోతుంటారు. ఇక శని ఆదివారాల్లో అయితే ఈ భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే.. ఏడు కొండలు ఎక్కాల్సిందే.. దట్టమైన అటవీ ప్రాంతం గుండా వేసిన ఘాట్ రోడ్డుల్లో ప్రయాణం చేసి ఏడుకొండలవాడిని భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అయితే భక్తులతో నిత్యం రద్దీగా ఉండే తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత పులి సంచారం కలకలం రేపుతుంది.
శనివారం సాయంత్రం మొదటి ఘాట్ రోడ్డులోని 30వ మలుపు వద్ద చిరుత పులి నీరు త్రాగి సేద తీరుతూ వాహనదారుల కంట పడింది. దీంతో చిరుత పులిని చూసిన వాహనదారులు వేంటనే తమ చేతిలోని సెల్ ఫోన్స్ తో చిత్రీకరించారు. శేషాచలం కొండల నడుమ చిన్నపాటి కొలను వద్ద చిరుత పులి సేద తీరుతున్న నక్కి నక్కి చూస్తున్న దృశ్యాలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. వేసవి కాలం కావడం... ఎండలు మండిపోతుండటంతో.. శేషాచలం అటవీ ప్రాంతంలో చాలా వరకూ నీరు ఇంకి పోవడంతో దాహార్తిని తీర్చుకునేందుకు చిరుత పులులు అటవీ ప్రాంతం వదిలి బయటకు వస్తున్నాయి.
అయితే గత వారంలో తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని చివరి మలుపు వద్ద చిరుత పులిని చూసిన ప్రయాణికులు భయాందోళన గురై టిటిడి విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్ధలంకు చేరుకున్న టిటిడి విజిలెన్స్, అటవీ శాఖా అధికారులు చిరుత పులిని అటవీ ప్రాంతంలో తరిమి ప్రయాణికులను ఘాట్ రోడ్డులో అనుమతించారు.. ఘాట్ రోడ్డులో వాహనదారులు ప్రయాణం చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని టిటిడి విజిలెన్స్ అధికారులు ప్రయాణికులకు, శ్రీవారి భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు.